ఏకాదశి వ్రతం
ఏకాదశి వ్రతం చేయడానికి పూనుకునే వారు దశమి రోజునుంచే కొన్ని తప్పని సరి నియమాలు పాటించాల్సి ఉంటుంది. దశమి రోజున మాంసం, ఉల్లిపాయలు, మసూరి పప్పు మొదలై నిషేధిత పదార్థాలు ఆహారంగా తీసుకోకూడదు. రాత్రిపూట పూర్తిగా బ్రహ్మచర్యం పాటించాలి.
ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసి ఆలయానికి వెళ్ళి భగవద్గీత/భాగవతము పఠనం చేయాలి లేదా పురోహితుడు చదువుతుంటే మీరు వినాలి.
" ఓం నమో భగవతే వాసుదేవాయ " ఈ ద్వాదశాక్షరిమంత్రాన్ని కానీ లేదా "ఓం నమో నారాయణాయ" అష్టాక్షరీ మంత్రాన్నీ మంత్రాన్ని జపించాలి. రామ, కృష్ణ, నారాయణ మొదలైన పేర్లతో భగవన్నామ స్మరణ చేయాలి. విష్ణు సహస్రనామాలను పారాయణ చేయాలి.
దేవుడిని దర్శించుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. ఎక్కువగా మాట్లాడకూడదు.
ముఖ్యంగా ఈ వ్రతం పాటించే రోజు వీలైనంత ఎక్కువగా దాన, ధర్మాలు చేయాలి. ఇతరులు తయారు చేసిన ఆహార పదార్థాలను ఎట్టిపరిస్థితులలోనూ ఆహారంగా తీసుకోకూడదు.
శ్రీమద్భాగవతం ప్రకారము విష్ణుభక్తులు ఏకాదశి వ్రతాన్ని తప్పనిసరిగా పాటించాలి. త్రయోదశి వచ్చే ముందే వ్రతాన్ని పూర్తి చేసి వ్రత పారణ (భోజనం) చేయాలి.
దశమి రాత్రి, ఏకాదశి పూర్తి రోజు, ద్వాదశి ఉదయము అరటిపండు, మామిడి పండు, ద్రాక్ష, బాదం, పిస్తా, పాలు మొదలైనవి ఆహారంగా తీసుకోవాలి. మీరు ఆహారంగా తీసుకునే ప్రతి పదార్థం భగవంతునికి సమర్పించి ఆ తర్వాతే ఆహారంగా తీసుకోవాలి. ఆహారం తీసుకునే ముందు తులసీ దళం సమర్పించాలి. ద్వాదశిరోజున బ్రాహ్మణులకు తీపి పదార్థాలు, దక్షిణ ఇవ్వాలి. కోపగించుకోకుండా మంచి మాటలు మాట్లాడాలి. ఈ వ్రతం చేసేవారు అత్యద్భుతమైన ఫలితాలను పొందుతారు.
పండిత డా. గానుగుల యుగంధరాచార్య గురూజీ ......🖋
విజయవాడ

Comments
Post a Comment