ఆహార దోషం

మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి.

1.  అర్ధ దోషం

2.  నిమిత్త దోషం         

3.  స్ధాన దోషం

4.  గుణ దోషం   

5.  సంస్కార దోషం

ఆహారం తీసుకొనే ముందు ఈ 5 దోషములు తెలుసుకొనుట చాలా ముఖ్యం. 

1. అర్ధ దోషం :

ఒక సాధువు  తన శిష్యుని ఇంటికి భోజనానికెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో  ఒకవ్యక్తి  వచ్చి ఆ శిష్యునికి  ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు. భోజనంచేసి, సాధువు ఒకగదిలో విశ్రాంతి తీసుకోసాగాడు. ఆ గదిలోనే  శిష్యుడు దాచినడబ్బు మూటవుంది. హఠాత్తుగా సాథువు మనసులో దుర్భుధ్ధి కలిగింది. ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తనసంచీలో దాచేశాడు. తర్వాత శిష్యుని వద్ద సెలవుతీసుకుని, తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. మరునాడు పూజా సమయంలో తను చేసినపనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడాసాధువు.  

తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనంవల్లనే తనకా దుర్బుద్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దున్నే  మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుద్ధమైనట్టు అర్థంచేసుకున్నాడు. వెంటనే  తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆడబ్బును  తిరిగిచ్చేసాడు. శిష్యుడిని “ఏవృత్తి ద్వారా నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు?” అని అడిగాడు. 

శిష్యుడు తలవంచుకొని, “నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బుకాదు” అని తలవంచుకొన్నాడు. ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడమే ‘అర్ధదోషం.’  మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం. 

2. నిమిత్త దోషం :

మనం తినే ఆహారాన్ని  వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమగల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి. వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాకకూడదు. ఆహారంమీద దుమ్ము, శిరోజాలవంటివి పడకూడదు. అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతివంట భుజిస్తే వారి దుష్టగుణాలు అవతలివారికి కలుగుతాయి. 

భీష్మాచార్యులవారు కురుక్షేత్రయుద్ధంలో బాణాలతో  కొట్టబడి యుద్ధం ముగిసేవరకు అంపశయ్యమీద ప్రాణాలతోనేవున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీకృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచిమంచి  విషయాలను  బోధిస్తూ వచ్చాడు. అప్పుడు ద్రౌపదికి ఒక ఆలోచన కలిగింది. “ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దుర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించలేకపోయారు?” అని అనుకొన్నది.

ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు,  “అమ్మా! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూవచ్చాను. నా స్వీయబుద్ధిని ఆ ఆహారం తుడిచిపెట్టింది. శరాఘాతాలతో, ఛిద్రమైన దేహంతో, ఇన్నిరోజులు ఆహారం తీసుకోనందున, ఒంట్లోఉన్న పాతరక్తం - బిందువులుగా బయటికి పోయి నేను ఇప్పుడు పవిత్రుడినైనాను. నాబుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు. 

చెడ్డ గుణాలున్నవారు ఇచ్చింది  తిన్నందువల్ల మనిషిలోని మంచి గుణములు నశించి 'నిమిత్త దోషం' ఏర్పడుతుంది.

3. స్ధాన దోషం :

ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలుండాలి. వంటచేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాలవల్ల చేయబడినవంట కూడా పాడై పోతుంది. యుద్ధ రంగం, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివికావు. 

దుర్యోధనుడు  ఒకసారి 56 రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని  విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి, విదురుని యింటికి భోజనానికెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది.  తినడానికి ఏమి పెట్టాలని ఆలోచించి, ఆనంద సంభ్రమాలతో తొందరపడి, అరటి పండు తొక్కవల్చి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే తీసుకొని  ఆనందంతో భుజించాడు. 

ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, “విదురా! నేను ఆప్యాయతతో  కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధాభక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏదిచ్చినా సంతోషంగా తీసుకుంటాను” అని అన్నాడు. 

కనుక మనం ఆహారం వడ్డించేప్పుడు, ప్రేమతో వడ్డించాలి.

4. గుణ దోషం :

మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్వికాహారం, ఆధ్యాత్మికాభివృద్ధి ని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని  లౌకికమాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది.

5. సంస్కార దోషం :

ఆహారం వండేవారి సంస్కారాన్నిబట్టి దోషం ఏర్పడుతుంది. సంస్కారవంతుల చేతివంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతివంట లేని రోగాన్ని తెచ్చి పెడుతుంది.

ఆహారం వండేటప్పుడు గానీ 

ఇంట్లో వారికి పెట్టేటప్పుడు 

భగవన్నామస్మరణ వల్ల దోషం

యొక్క స్థితి తగ్గుతుంది.


మీకు మేలు జరిగే సలహా 👇

వండిన అన్నం మీద కొద్దిగా నెయ్యి పంచదార వేసి పక్షులకు మిగతా జీవకోటికి అందినచో ఏ ఇల్లాలు పెడుతుందో ఆమె కుటుంబంను సదా సర్వదా పరమేశ్వరుడు రక్షించును.

సర్వే జనాః సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు


గిన్నీస్ బుక్ రికార్డ్ హోల్డర్ - ఆస్ట్రో స్పిరిట్యువల్ గురు - త్రికాలజ్ఞాన విభూషణ

పండిత డా. గానుగుల యుగంధరాచార్య గురూజీ ......🖋

విజయవాడ

చరవాణి :  76984 66666 

Comments

Popular posts from this blog